నాటింగ్హామ్: 2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం మాత్రం కలగానే మిగిలిపోతోంది. ఈసారి ఐదు టెస్ట్ల సిరీస్ ఆడబోతోంది విరాట్ కోహ్లి సేన. రెండో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా జరగబోతున్న తొలి సిరీస్ ఇది. బుధవారం నాటింగ్హామ్లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్ మొదలవుతుంది. ఈసారి చరిత్ర తిరగరాసే అవకాశం కోహ్లి సేన ముందు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి నిజంగానే ఆ చాన్స్ ఉందా? రెండు జట్ల బలాబలాలేంటి?
మన టీమ్ ఇంగ్లండ్లో అడుగుపెట్టి 8 వారాలు అవుతోంది. అక్కడే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. తర్వాత మూడు వారాల విశ్రాంతి. ఈ గ్యాప్లోనే టీమ్లో కొవిడ్ కేసులు, గాయాలు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సిరీస్ అంటే సవాలే. అయితే ఈసారి పటిష్టంగా ఉన్న మన బ్యాటింగ్ లైనప్నే నమ్ముకొని బరిలోకి దిగుతోంది టీమిండియా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, పుజారాలకు తోడు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్తో కూడిన లైనప్ బలంగా ఉంది. అందులోనూ కోహ్లి, రహానే, పుజారాలకు ఇది మూడో ఇంగ్లండ్ టూర్. దీంతో అక్కడి కండిషన్స్, పిచ్లేంటో వాళ్లకు బాగా తెలుసు.
బ్యాటింగే కీలకం
బౌలింగ్ లైనప్లో స్వింగ్ చేసే బౌలర్ లేడన్నది తప్పితే పెద్దగా లోపాలేమీ లేవు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లతో కూడిన పేస్ బౌలింగ్తోపాటు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం కూడా స్ట్రాంగానే ఉంది. సిరాజ్ బాల్ను స్వింగ్ చేయగలడు. అక్కడి కండిషన్స్ అతని బౌలింగ్కు బాగా సూటవుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతన్ని తీసుకోకుండా చేసిన పొరపాటును కోహ్లి ఈసారి రిపీట్ చేయకపోవచ్చు.
ఇంగ్లండ్.. స్టార్లు మిస్
ఇటు ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే బలహీనపడింది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తోపాటు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా సిరీస్కు దూరమయ్యారు. మొత్తం యువకులతో కూడిన బ్యాటింగ్ లైనప్ భారాన్ని కెప్టెన్ జోరూటే మోయాల్సి ఉంది. పైగా ఈ ఏడాది మొదట్లో ఇండియాకు వచ్చిన ఆ టీమ్ 1-3తో ఓడింది. సిరీస్ ప్రారంభానికి ముందు ఇది కూడా ఇండియన్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.
పేస్ పిచ్లతో ప్రతీకారం
ఇంగ్లండ్ టీమ్ ఇండియా వచ్చినప్పుడు పూర్తిగా స్పిన్ పిచ్లతో వాళ్ల బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. అశ్విన్ ఏకంగా 32 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది. దీంతో పచ్చికతో కూడిన పేస్ పిచ్లతో ఇండియన్ బ్యాట్స్మెన్కు స్వాగతం పలకడానికి ఆ టీమ్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆండర్సర్, బ్రాడ్లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.