MI vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్(29), పూజా వస్త్రాకర్ (11) ధాటిగా ఆడారు. అమేలియా బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించింది. ఓపెనర్ యస్తికా భాటియా(21), హేలీ మాథ్యూస్ (26) స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. ఫామ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్(14) విఫలమైంది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ రెండు వికెట్లు తీసింది. అంజలి సర్వానీ, పర్షవీ చోప్రాకు ఒక్కో వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయిన ముంబై జట్టు 31 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ యస్తికా భాటియా(21)ను అంజలీ సర్వానీ ఔట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన నాట్ సీవర్ బ్రంట్ 6 పరుగులు వద్ద ఎకిల్స్టోన్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయింది. 13వ ఓవర్లో హర్మన్ప్రీత్(14)ను ఎకిల్స్టోన్ బౌల్డ్ చేసింది. దాంతో, 104 రన్స్ వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది.
హర్మన్ప్రీత్ ఔటయ్యాక బ్రంట్ గేర్ మార్చింది. బౌండరీలతో యూపీ బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో ఫిఫ్టీ బాదింది. ఓపెనర్ మాథ్యూస్ (26) హర్మన్ప్రీత్ కౌర్, అమేలియా కేర్తో కలిసి విలువైన పరుగులు జోడించింది. నాలుగో వికెట్కు 60 రన్స్ రాబట్టారు. ఆ తర్వాత వచ్చిన పూజా నాలుగు బంతుల్లోనే సిక్స్, ఫోర్తో 11 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని బ్రంట్ స్టాండ్స్లోకి పంపింది. దాంతో, దీప్తి శర్మ వేసిన ఆఖరి ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.