Stuart Broad : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమవ్వడంతో మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson), కోహ్లీల సమరాన్ని మిస్ అవుతున్నామని కొందరు నిట్టూరుస్తున్నారు. రాజ్కోట్ టెస్టుకు ముందు ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు. కోహ్లీ ఆడకపోవడం అనేది టెస్టు క్రికెట్కు ఎంతో అవమానకరం అని బ్రాడ్ వెల్లడించాడు.
‘టీమిండియా ఒక చాంపియన్ ప్లేయర్ను మిస్ అవుతోంది. కోహ్లీ ఆడకపోవడం టెస్టు ఫార్మాట్కు పెద్ద అవమానం లాంటిది. అతడొక గొప్ప ఆటగాడు. ఆట పట్ల విరాట్ అంకితభావం, మైదానంలో చిరుతను తలపించే అతడి దూకుడు అందరికీ ఇష్టమే. అయితే.. కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు ఎంతటి ప్లేయర్ను అయినా ఆటకు దూరం చేస్తాయి. కోహ్లీ ఆడకపోవడం అనేది యువ ఆటగాళ్లకు మంచి చాన్స్. భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కొందరు కుర్రాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలందిస్తారు’ అని బ్రాడ్ తెలిపాడు.
విరాట్ కోహ్లీ
అంతేకాడు భారత పర్యటనలోనూ బజ్బాల్(Buzz Ball) విజయవంతమైందని ఈ మాజీ పేసర్ అన్నాడు. ‘ఈమధ్య కాలంలో బెన్ స్టోక్స్ బృందం చేసిన అద్భుతాల్లో ఉప్పల్ టెస్టు విజయం ఒకటి. అంతకుముందు ఇంగ్లండ్ 3-0తో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ను మేము ఓడించాం. మొత్తంగా చూస్తే.. బజ్బాల్ సక్సెస్ అయినట్టే’ అని బ్రాడ్ వెల్లడించాడు.
స్టువార్ట్ బ్రాడ్
ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడైన బ్రాడ్ నిరుడు జూలైలో రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులు ఆడిన ఈ పేసర్ 604 వికెట్లు పడగొట్టాడు. వన్డేలతో కలిపి మొత్తంగా 800 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడుగా నిలిచాడు. అంతేకాదు ఆసీస్పై 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా గుర్తింపు సాధించాడు.