కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(West Bengal Assembly)లో ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాలు సుమారు 30 రోజులు జరగనున్నాయి. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో అగ్నిమిత్ర పాల్, మిహిర్ గోస్వామి, బంకిమ్ ఘోష్, తాపసి మోండల్, శంకర్ ఘోష్ ఉన్నారు.
ఇవాళ ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే.. బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నార్త్ 24 పార్గనాస్ జిల్లాలోని సందేశ్ఖాలీలో జరిగిన అల్లర్లకు టీఎంసీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సభలో ఫ్లోర్మీద కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. నినాదాలు చేశారు. సందేశ్ఖాలీకి అండగా ఉన్నామని తెల్ల దుస్తులు ధరించారు.
టీఎంసీ ఎమ్మెల్యే శోభన్దేవ్ ఛటర్జీ ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ బీమన్ బెనర్జీ ఆమోదించారు. ఆ తర్వాత స్పీకర్ ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభాకార్యక్రమాలను బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఛటర్జీ ఆరోపించారు.
కొన్ని రోజుల క్రితం సందేశ్ఖాలీలో భారీ సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు భూముల్ని లాక్కున్నారని, మహిళల్ని కూడా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్ను అరెస్టు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.