ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మాదిరి స్కోరు సాధించింది. డుప్లెసిస్(33: 17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), మొయిన్ అలీ(26: 20 బంతుల్లో 1ఫోర్, 2ఫోర్లు), అంబటి రాయుడు(27: 17 బంతుల్లో 3సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో చెన్నై 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యంగ్ బౌలర్ చేతన్ సకారియా(3/36), క్రిస్ మోరీస్(2/33) అద్భుతంగా బౌలింగ్ చేశారు. సకారియా కీలక సమయంలో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేశాడు. సురేశ్ రైనా(18), మహేంద్ర సింగ్ ధోనీ(18) ధాటిగా ఆడలేకపోయారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి శుభారంభం లభించలేదు. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్ల్లో 5(8), 5(16) పరుగులే చేసిన గైక్వాడ్ ఈ మ్యాచ్లోనూ 10(13) రన్స్కే పెవిలియన్ చేరాడు. గత సీజన్లో అద్భుతంగా రాణించిన గైక్వాడ్ ఈ ఏడాది ఆరంభం నుంచి తడబడుతున్నాడు. ఉనద్కత్ వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్ దంచికొట్టాడు. సూపర్ స్ట్రైకింగ్తో 4 4 6 4 బాది 19 పరుగులు రాబట్టాడు. క్రిస్ మోరీస్ వేసిన తర్వాతి ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన డుప్లెసిస్.. బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. ఈ సమయంలో మొయిన్ అలీ కాసేపు దూకుడుగా ఆడి రన్రేట్ పడిపోకుండా చూశాడు. హిట్టింగ్ చేస్తున్న అలీని తెవాటియా ఔట్ చేశాడు.
రియాన్ పరాగ్ వేసిన 11వ ఓవర్లో రాయుడు, రైనా చెరో సిక్స్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. రాహుల్ తెవాటియా వేసిన ఆ తర్వాతి ఓవర్లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లు బాది 14 రన్స్ రాబట్టాడు. దీంతో 12 ఓవర్లకే చెన్నై స్కోరు 100 దాటింది. చేతన్ సకారియా వేసిన 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన రాయుడు(27) సూపర్ కవర్లో పరాగ్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో రైనా(18) కూడా క్రిస్ మోరీస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ, జడేజా పెద్దగా రన్స్ రాబట్టలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన ధోనీ.. తర్వాతి స్లో బాల్ను షాట్ ఆడబోయి బట్లర్ చేతికి చిక్కాడు. మోరీస్ వేసిన తర్వాతి ఓవర్లో జడ్డూ వెనుదిరిగాడు. ఆఖర్లో డ్వేన్ బ్రావో(20 నాటౌట్) తమదైన శైలిలో రెచ్చిపోయి జట్టు స్కోరు 180 దాటించారు.