తాష్కెంట్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆకాశ్ సాంగ్వాన్(67కి), నిశాంత్దేవ్(71కి) ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన 67కిలోల బౌట్లో ఆకాశ్ 5-0 తేడాతో ఫు మింగ్కె(చైనా)పై అలవోక విజయం సాధించాడు. మొదటి నుంచే జోరు కనబరిచిన ఆకాశ్ పదునైన పంచ్లతో చైనా బాక్సర్పై విరుచుకుపడ్డాడు. ఓవైపు ప్రత్యర్థి పంచ్లను కాచుకుంటూ ఎడం పాటిస్తూ వీలు చిక్కినప్పుడల్లా పంచ్లు విసిరాడు. అయితే ఆఖరి రౌండ్లో పుంజుకునేందుకు చైనా బాక్సర్ ప్రయత్నించినా..అప్పటికే స్పష్టమైన ఆధిక్యం కబనరిచిన ఆకాశ్ బౌట్ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు 71కిలోల పోరులో నిశాంత్దేవ్ 5-0తో సాంగ్మిన్ (కొరియా)పై విజయం సాధించాడు. గత రౌండ్లో ప్రపంచ కాంస్య విజేత అలియేవ్ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో నిశాంత్.. కొరియా బాక్సర్ను చిత్తు చేశాడు. ఆఖరి రెండు రౌండ్లలో ఇద్దరు బాక్సర్లు ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్స్లో హుసాముద్దీన్.. సవిన్ ఎడ్వర్డ్ (రష్యా)తో తలపడుతాడు.