ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కళ తప్పనుందా? ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవకాశం ఉన్నదన్న వార్తల నేపథ్యంలో అంతకుముందే ఇంటికి వెళ్లిపోవాలని ఈ ఇద్దరు ప్లేయర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆండ్రూ టై తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత కారణాలని చెప్పి ఆర్సీబీ ప్లేయర్స్ వెళ్లిపోయినా ఆస్ట్రేలియా ప్లేయర్స్లో ఒక రకమైన ఆందోళన నెలకొన్నదని ఆ దేశానికి చెందిన నైట్రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్పీ చెప్పాడు. కరోనా సెకండ్ వేవ్తో సతమతమవుతున్న ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. అది జరగక ముందే ఇంటికి వెళ్లిపోవాలని వార్నర్, స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ భావిస్తున్నారని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది.
వార్నర్ వెళ్లిపోతే ఇప్పటికే కిందామీదా పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ పనైపోయినట్లే. అటు స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు ఆడుతున్నా.. ఈ సీజన్లో ఇంకా తన మార్క్ ఆట చూపించలేదు. ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళనగా ఉన్న 30 మంది ఆస్ట్రేలియా ప్లేయర్స్, కోచ్లు, కామెంటేటర్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు కూడా ఆ రిపోర్ట్ వెల్లడించింది.
అటు ఆస్ట్రేలియా హోంమంత్రి కారెన్ ఆండ్రూస్ కూడా ఇండియాలో చిక్కుకుపోయిన 8 వేల మంది ఆస్ట్రేలియన్ల భద్రతపై స్పందించారు. అక్కడున్న ఆస్ట్రేలియన్లంతా సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఆయన అన్నారు. మరోవైపు క్వీన్స్ల్యాండ్ ప్రీమియర్ అనాస్టేసియా పాలాజుక్.. ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు.