Mohammed Shami | టీంఇండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)కి కోల్కతా హైకోర్టు షాకిచ్చింది. షమీ నుంచి విడిపోయిన భార్య హసీన్ జహన్ (Hasin Jahan)కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.50వేలు హసీన్కు కాగా, మరో రూ.80వేలు కుమార్తె బాగోగుల కోసం చెల్లించాల్సిందిగా అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందిత గంగూలీ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. కోర్టు తాజా తీర్పుతో షమీ ప్రతి నెలా హసీన్కు రూ.1.30లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయమైన హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది.
అదే సమయంలో, హసీన్ తన కుమార్తె ఖర్చులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఫిర్యాదులో ఆరోపించింది. తన కుమార్తె పోషణకు గానూ నెలకు రూ.10 లక్షలు అందించేలా చూడాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ అంశంపై తీర్పునిచ్చిన కోర్టు.. హసీన్ డిమాండ్ను తిరస్కరించింది. షమీ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతినెలా భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అదనపు జిల్లా జడ్జి అనిందిత గంగూలీ తీర్పును వెలువరించారు.