ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో పవర్ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (0)ని తొలి ఓవర్లోనే డకౌట్ చేసిన భువీ ఈ ఘనత సాధించాడు.
ఈ వికెట్తో టీ20 క్రికెట్లో.. అందునా పవర్ప్లేలో భువీ తీసిన వికెట్ల సంఖ్య 34కు చేరింది. పొట్టి క్రికెట్లో ఇప్పటి వరకు పవర్ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిల్యాండ్ పేసర్ టిమ్ సౌథీ ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా పవర్ప్లేలో 33 వికెట్లు తీసుకున్నారు.
భువీ వీళ్లిద్దరినీ దాటి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, ఇదే మ్యాచ్ రెండో ఓవర్లో వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా.. అంతర్జాతీయ టీ20లో వికెట్ తీసిన తొలి భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్ సిరీస్లో హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భువనేశ్వర్ కుమార్.. జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు.