Bhuvaneshwar : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. అయితే.. అతను ఒకవేళ క్రికెటర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడో తెలుసా..? రెజ్లింగ్ను కెరీర్గా ఎంచుకనేవాడట. ఈ విషయాన్ని భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) వెల్లడించాడు. సియెట్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొన్న భువీ మాట్లాడుతూ.. కోహ్లీ క్రికెటర్ కాకపోయి ఉంటే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE)లో కెరియర్ వెతుక్కుని ఉండేవాడని అన్నాడు. జట్టులోనే తాను అత్యుత్తమ బౌలర్నని కోహ్లీ తరచూ అనేవాడని, అది విని తమకు భయం వేసేదని భువీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ కనుక బౌలింగ్ వేస్తే తమ స్థానాలకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడేవాళ్లమని సరదాగా అన్నాడు. తాజాగా ప్రకటించిన ఆసియా కప్ బృందంలో భువీకి చోటుదక్కలేదు. అతడు చివరిసారి నిరుడు నవంబరులో న్యూజిలాండ్తో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు ప్రాతినిధ్యం వహించాడు.
2012లో జాతీయ జట్టులో అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి 294 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియాలో టాప్ బౌలర్గా కొనసాగిన భువీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుండడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
భువనేశ్వర్ కుమార్
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో 500కుపైగా మ్యాచ్లు ఆడిన రన్ మెషీన్ 25 వేలకుపైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్లలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు ఉన్న ఆటగాడు కోహ్లీనే.
34 ఏళ్ల విరాట్ ఖాతాలో ఇప్పుడు 76 శతకాలు ఉన్నాయి. వన్డేలో కోహ్లీ పేరున 46 సెంచరీలు ఉన్నాయి. 275 మ్యాచుల్లో అతడు వీటిని సాధించాడు. మరో 4 సెంచరీలు సాధిస్తే లెజండరీ ఇండియన్ బ్యాటర్ సచిన్ రికార్డు (49) బద్దలవుతుంది.
విరాట్ కోహ్లీ
ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 17 మ్యాచ్లు ఆడి 984 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే సచిన్ రికార్డు ఈ ఏడాదే బద్దలవ్వడం ఖాయం. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 17 వరకు జరగనున్న ఆసియా కప్లో కోహ్లీ వీరవిహారం చేయాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.