హుజూర్నగర్, మార్చి 15: సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని హుజూర్నగర్ యువకుడు బొబ్బ భరత్రెడ్డి చేతల్లో చూపెట్టాడు. సూర్యాపేట జిల్లా నుంచి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న భరత్రెడ్డి ఈనెల 15వ తేదీ నుంచి శ్రీలంకలో మొదలయ్యే అంతర్జాతీయ స్థాయి టీ20, వన్డే టోర్నీలకు ఎంపికయ్యాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులైన భరత్రెడ్డి తల్లిదండ్రులు భాస్కర్రెడ్డి, నిర్మల క్రికెట్లో అతన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన భరత్ గత ఏడేండ్లుగా బుచ్చిబాబు, ఇంద్రశేఖర్రెడ్డి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు వివిధ టోర్నీలు ఆడిన భరత్ 100కు పైగా వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ బౌలర్ సిరాజ్ను ఆదర్శంగా తీసుకునే భరత్ భవిష్యత్లో జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్లో ఆడటమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నాడు. శ్రీలంకలో జరిగే టోర్నీ కోసం వెళుతున్న భరత్రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్లో అద్భుత ప్రతిభతో తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.