అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడి ఎన్నికల్లో భారత జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఓడిపోయారు. కల్యాణ్ చౌబే ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం భుటియా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో ఇంత దారుణంగా రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటారని తాను ఎన్నడూ ఊహించలేదన్నాడు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉన్న హోటల్కు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చాడని, అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటర్లతో సమావేశమయ్యాడని భుటియా వెల్లడించాడు.
‘‘నిజంగా గెలుస్తామని నా ప్రత్యర్థులకు నమ్మకముంటే.. కేంద్ర మంత్రిని ఎందుకు పిలుస్తారు? ఆ పవర్ఫుల్ నేత వచ్చి ఎన్నికల రోజున తెల్లవారుజాము 2 గంటలవరకు హోటల్లో ఎందుకు మీటింగ్ పెడతారు? ఓటర్లందరినీ ఒక ఫ్లోర్కు తీసుకెళ్లి ఏం చేశారు?’’ అని ప్రశ్నించాడు.
అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ (ఫిఫా) నుంచి భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని కూడా మంచిదనే అనుకోవాలని, మళ్లీ భారత ఫుట్బాల్ సమాఖ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్తూ భుటియా ఎన్నికల్లో నిలబడ్డాడు. కానీ చివరకు కల్యాణ్ చౌబే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.