న్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో క్రికెటర్లు సందడి చేశారు. 2025-26 సీజన్లో ఏకంగా ఐదు ఐసీసీ ట్రోఫీలతో కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఇందుకు తోడు దేశ క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన దిగ్గజ ప్లేయర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీరాజ్ను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కండ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో ‘నమన్’ అవార్డుల వేడుక యువకులు, అనుభవజ్ఞుల కలయికగా జరిగింది. గత సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన టీమ్ఇండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్గిల్తో పాటు మహిళల క్రికెట్లో తనకంటూ ప్రత్యేకతను లిఖించుకున్న స్మృతి మంధాన అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ల అవార్డులు కైవసం చేసుకున్నారు.
ముఖ్యంగా కెప్టెన్గా తొలిసారి ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గిల్ అంచనాలకు మించి రాణించాడు. సిరీస్లో పది ఇన్నింగ్స్లో 75.40 సగటుతో 754 పరుగులు చేసి టోర్నీ టాపర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను వారి సొంతగడ్డపైనే దీటుగా నిలువరిస్తూ సిరీస్ 2-2తో డ్రా కావడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇంగ్లిష్ పిచ్లపై అంతగా ఆడిన అనుభవం లేకపోయినా దిగ్గజాల గైర్హాజరీలో గిల్ దుమ్మురేపాడు. తన దూకుడైన బ్యాటింగ్తో ఓ డబుల్ సెంచరీ(269) సహా నాలుగు సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది దుబాయ్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ గిల్ అదరగొట్టాడు.
వన్డేల్లో నంబర్వన్ ర్యాంక్ బ్యాటర్గా బరిలోకి దిగిన గిల్..బంగ్లాదేశ్పై అజేయ సెంచరీ(101 నాటౌట్) సహా టోర్నీలో 188 పరుగులతో టీమ్ఇండియా ట్రోఫీ విజయంలో కీలకమయ్యాడు. పాలీ ఉమిగ్రర్ అవార్డు విజేతగా నిలిచిన గిల్ స్పందిస్తూ ‘ఈ అవార్డు కోసం బీసీసీఐ నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. దీన్ని దక్కించుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నా. ఇది నా ఒక్కని వల్ల సాధ్యం కాలేదు, సహచరుల సహకారంతో అవార్డు పొందగలిగాను. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నాడు.

మరోవైపు రికార్డు స్థాయిలో ఐదో సారి మహిళల బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు మంధాన సొంతమైంది. 2025 సీజన్లో మంధాన 1703 పరుగులు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా మంధాన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ‘ఇది నాకు ఎంతో ప్రత్యేకం. జట్టు సహకారం లేకుండా వ్యక్తిగత రికార్డుల గురించి మాట్లాడం సరైంది కాదు. నా కెరీర్లో ఇది అద్భుతమైన ఏడాది. అవార్డుకు ఎంపిక చేయడంతో పాటు మహిళా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతున్న బీసీసీఐకి ధన్యవాదాలు’ అని మంధాన అంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరీల్లో భారత క్రికెట్ జట్లు ఐదు ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకోవడం విశేషం. 2025 మహిళల అండర్-19 ప్రపంచకప్తో మొదలుపెడితే ఆ తర్వాత పురుషుల చాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో అండర్-19 ప్రపంచకప్, పురుషుల టీ20 వరల్డ్కప్ సభ్యులను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. ఆయా జట్లలో సభ్యులైన క్రికెటర్లు జ్ఞాపికలు అందుకున్నారు. తాజాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియా క్రికెటర్లు కప్తో ఫొటోకు ఫోజులు ఇచ్చారు. మరోవైపు మహిళల అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన హైదరాబాదీ గొంగడి త్రిష ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది.
షెఫాలీవర్మ… (బెస్ట్ వుమన్ సీనియర్ క్రికెటర్-దేశవాళీ వన్డే)
ఇరా జాదవ్… (బెస్ట్ వుమన్ క్రికెటర్- దేశవాళీ)
హర్ష్దూబే … (బెస్ట్ ఆల్రౌండర్-రంజీ ట్రోఫీ)
ఆయూశ్ మాత్రె… (బెస్ట్ ఆల్రౌండర్-దేశవాళీ పరిమిత ఓవర్ల ఫార్మాట్)
దేశ క్రికెట్కు సేవలందించిన రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ అత్యున్నత పురస్కారం కర్నల్ సికే నాయుడు అవార్డు దక్కగా, హైదరాబాదీ దిగ్గజం మిథాలీరాజ్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో మెరిసింది.