న్యూఢిల్లీ: భారత స్పిన్నర్లలో వికెట్లు తీయాలనే కసి కనిపించలేదని.. అందుకే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ మిడిల్ ఓవర్స్లో టీమ్ఇండియా పట్టు సాధించలేకపోయిందని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. నాలుగేండ్ల తర్వాత వన్డే జట్టులోకి తిరిగివచ్చిన 35 ఏండ్ల రవిచంద్రన్ అశ్విన్ను దాటి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. మంగళవారం అతడు మాట్లాడుతూ.. ‘అశ్విన్, ఇషాంత్ శర్మ టీమ్ఇండియా కోసం ఎంతో చేశారు. వన్డేలు, టెస్టుల్లో వీరు చక్కటి ప్రదర్శన కనబర్చారు. అశ్విన్ చాంపియన్ బౌలరే! కానీ వన్డేల విషయంలో భారత్.. అశ్విన్ దాటి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. కుల్దీప్ యాదవ్ మంచి ఎంపిక అని నా అభిప్రాయం. కుల్దీప్, చాహల్ ద్వయాన్ని (కుల్చా జోడీ) కొనసాగిస్తే మంచిది. సఫారీలతో సిరీస్లో అశ్విన్, చాహల్ తగినన్ని అవకాశాలు సృష్టించలేకపోయారు. దూకుడుగా కాకుండా డిఫెన్సివ్ పద్ధతిలో బౌలింగ్ చేశారు. అందుకే మిడిల్ ఓవర్స్లో టీమ్ఇండియాకు పట్టు చిక్కలేదు’ అని అన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో ప్రత్యర్థి స్పిన్నర్లు తబ్రేజ్ షంసీ, కేశవ్ మహరాజ్.. పార్ట్ టైమర్ మార్క్మ్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగా.. మన స్పిన్ ద్వయం మాత్రం మూడంటే మూడు వికెట్లతోనే సరిపెట్టుకుంది.