Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ వచ్చే ఏడాది అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో ఆడతాడా..? గతేడాది ముగిసిన పొట్టి ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టిన బీసీసీఐ.. మరోసారి వాళ్లను ఆడిస్తుందా..? లేక యువ భారత్తోనే ముందుకు సాగుతుందా..? అన్నది భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో రోహిత్ తన టీ20 భవిష్యత్పై క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శనివారం ముంబైలో ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి హాజరైన జై షాకు విలేకరుల నుంచి రోహిత్ రీఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. అతడి రీఎంట్రీపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా వాళ్లు కోరడంతో జై షా స్పందిస్తూ… ‘దాని గురించి ఇప్పుడే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమేముంది..? వరల్డ్ కప్ జూన్లో మొదలుకావాల్సి ఉంది. అంతకంటే ముందే మనకు అఫ్గానిస్తాన్ సిరీస్ ఆ పైన ఐపీఎల్ కూడా ఉంది.. అప్పుడు చూద్దాం’ అని అన్నాడు.
హార్ధిక్ రికవరీపై..
వన్డే వరల్డ్ కప్లో గాయమై తర్వాత ఆ టోర్నీతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్కు కూడా దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా గాయంపైనా జై షా స్పందించాడు. ‘అతడు (పాండ్యా) ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. పూర్తిస్థాయిలో రికవరీ అవడానికి చాలా కష్టపడుతున్నాడు. మేం అతడి ఆరోగ్య పరిస్థితిపై రోజూ పర్యవేక్షిస్తున్నాం. అఫ్గాన్తో సిరీస్ కంటే ముందే అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని నమ్మకముంది’ అని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత భారత్.. జనవరిలో స్వదేశంలోనే అఫ్గాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడబోయే ఆఖరి టీ20 సిరీస్ ఇదే అవనుంది.