న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించింది. ఏప్రిల్ 5 తర్వాత అతితక్కువగా బుధవారం 3846 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 235 మంది మరణించారు. మరోవైపు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.78 శాతానికి పడిపోవడం అధికారులకు ఊరట ఇస్తోంది.
తాజా కేసులు 5000 దిగువన నమోదవడం వరుసగా ఇది మూడోసారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ తోనే ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. పాజిటివిటీ రేటును 4.9 శాతానికి తగ్గించాలన్నదే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.