ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో భారత ఓటమికి ప్రధాన కారణం ఏంటనే ప్రశ్న తలెత్తింది. దీనికి మాజీల నుంచి ఫ్యాన్స్ వరకూ ఎక్కువ మంది చెప్పిన కారణం మిడిలార్డర్ వైఫల్యం.
ముఖ్యంగా ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే చెత్త ప్రదర్శనల కారణంగా భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత క్రికెట్ అభిమానులు కూడా వీళ్లిద్దరినీ తొలగించి, యువకులకు అవకాశాలివ్వాలంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇప్పుడు తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
రహానే, పుజారా ఇద్దరూ రంజీ ట్రోఫీలో బాగా ఆడతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ‘వాళ్లు మంచి ఆటగాళ్లు. రంజీ ట్రోఫీలో ఆడుతూ భారీ స్కోర్లు చేస్తారని ఆశిస్తున్నా. రంజీ ట్రోఫీ చాలా పెద్ద టోర్నీ. మేమంతా ఇది ఆడిన వాళ్లమే’ అని వివరించాడు. దీంతో శ్రీలంక టూర్కు వీళ్లిద్దరినీ పక్కన పెడుతున్నారేమో? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ నిర్ణయం సెలెక్టర్ల చేతులో ఉంటుందని దాదా స్పష్టం చేశాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టును ప్రకటించే వరకూ ఈ విషయంపై స్పష్టత రాదేమో మరి.