BCCI | ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం మెల్లగా మిగిలిన టోర్నీలకు కూడా పాకుతున్నది. జట్లకు అదనపు ఆటగాళ్లను సమకూర్చే ఈ నిబంధనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దేశవాళీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను పూర్తి స్థాయిలో అమలు చేయాలని భారత క్రికెట్ నియంత్రణా మండలి ( BCCI ) నిర్ణయించింది.
వాస్తవానికి నిరుడు జరిగిన ముస్తాక్ అలీ టోర్నీలోనే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలిసారి ప్రవేశ పెట్టినా.. అప్పుడు ఒక జట్టు 14 ఓవర్ల లోపే ఇంపాక్ట్ ప్లేయర్ను వినియోగించుకోవాలనే నిబంధన విధించింది. దీంతో ఈ అంశంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం చర్చించి కొత్త నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ మాదిరిగా రెండు జట్లు ఎప్పుడైనా ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఒక్కో జట్టు మ్యాచ్ ఆరంభానికి ముందు ప్లెయింగ్ ఎలెవన్తో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంటుంది. అందులో నుంచి ఒకరిని తమ జట్టు అవసరాల మేరకు ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో చైనా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనేందుకు పచ్చజెండా ఊపింది. అదే సమయంలో పురుషుల వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. మొదట టీమ్ఇండియా ఈ టోర్నీలో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నా.. కమిటీ బరిలోకి దిగేందుకే మొగ్గుచూపింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రధాన జట్టు వన్డే వరల్డ్కప్లో ఆడుతున్న సమయంలో.. ద్వితీయ శ్రేణి జట్టు ఆసియా గేమ్స్లో పాల్గొననుంది. ప్రపంచకప్నకు ఎంపిక కాని ఆటగాళ్లకు ఈ జట్టు చోటు దక్కనుంది. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మూడు సార్లు మాత్రమే క్రికెట్ను భాగం చేశారుఉ. చివరిసారి 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత జట్టు పాల్గొనలేదు.