BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెరిసి తద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాక ఈ రెండింటికే అధిక ప్రాధాన్యమిస్తూ దేశవాళీ క్రికెట్ను పక్కనబెడుతున్న పలువురు క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకివ్వనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జట్టు నుంచి పలు కారణాల వల్ల సిరీస్ల నుంచి తప్పుకుంటున్న ఆటగాళ్లు (ప్రస్తుతం నేషనల్ టీమ్తో ఉన్నవారు, ఎన్సీఎలో ఉన్న సభ్యులు మినహా) తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాళీ ఆడాలని నిబంధనను విధించిన బీసీసీఐ.. తాజాగా మరో షాకివ్వనుందట. రంజీలను పక్కనబెడుతున్న క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే ఛాన్స్తో పాటు వేలంలో కూడా అనర్హత వేటు వేయనున్నట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ… ‘కొంతమంది క్రికెటర్లు ఆడేందుకు ఫిట్నెస్ ఉన్నా రంజీలను ఆడటం లేదు. ఒకవేళ వాళ్లు జాతీయ జట్టుకు దూరమైతే సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) వంటి టోర్నీలలో టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారు. ఆ తర్వాత రంజీ సీజన్కు వచ్చేసరికి మాత్రం స్టేట్ టీమ్స్కు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాంటివారిని నియంత్రించడానికి బీసీసీఐ త్వరలోనే కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది. ఐపీఎల్లో ఆడాలనుకుంటున్న ఆటగాళ్లు తప్పకుండా కనీసం ఆ సీజన్లో 3-4 రంజీ మ్యాచ్లు అయినా ఆడి ఉండాలి. అలా ఆడకుంటే ఐపీఎల్లో నో ఎంట్రీతో పాటు ఐపీఎల్ వేలంలో కూడా పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తాం..’ అని తెలిపాడు.
BCCI might make playing 3-4 Ranji Trophy games mandatory for IPL participation. (PTI) pic.twitter.com/mM88PKlGCO
— CricketMAN2 (@ImTanujSingh) February 13, 2024
ఐపీఎల్లో వస్తున్న ఆదరణ, డబ్బుతో జాతీయ జట్టులోకి వస్తున్న యువ క్రికెటర్లు ఆ తర్వాత రంజీ మ్యాచ్లు అంటేనే తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన బీసీసీఐ ప్రతినిధి.. దీనిని అరికట్టేందుకు త్వరలోనే బీసీసీఐ కఠినమైన నిబంధనలను తీసుకురానున్నట్టు తెలిపారు. బీసీసీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పనిసరిగా రంజీలు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. నెక్స్ట్ రంజీ మ్యాచ్లో అతడు ఆడే అవకాశాలున్నట్టు సమాచారం.