న్యూఢిల్లీ : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో మహిళా క్రికెటర్లు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్కు ప్రమోషన్ లభించింది. 2022-23 సీజన్కు వారిద్దరికి ‘బి’ కేటగిరి కాంట్రాక్టు దక్కింది. కాగా శిఖా పాండే, తానియా భాటియాలకు కాంట్రాక్టు దక్కలేదు. ఈ కాంట్రాక్టు అక్టోబర్నుంచి సెప్టెంబరు వరకు అమలులో ఉంటుంది. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం వెల్లడించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, బ్యాటర్ స్మృతి మందన, ఆల్రౌండర్ దీప్తి శర్మకు ‘ఎ’ కేటగిరి కాంట్రాక్టులోనే కొనసాగుతుండగా, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ‘బి’ కేటగిరీకి పడిపోయింది.
గత యేడాది ‘ఎ’ కేటగిరీ కాంట్రాక్టు పొదిన స్పినర్ పూనమ్ యాదవ్కు ఈసారి కాంట్రాక్టు దక్కలేదు. రేణుకా ఠాకూర్కు నేరుగా ‘బి’ కాంట్రాక్టు దక్కింది. హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా ‘సి’ కేటగిరీలోనే కొనసాగుతుండగా, కొత్తగా పేసర్ మేఘన సింగ్, బ్యాటర్లు దేవిక వైద్య, ఎస్.మేఘన, రాధా యాదవ్, యస్తిక భాటియాలను ‘సి’ కేటగిరిలో చేర్చారు. గాయాలతో బాధపడుతున్న పూజ వస్ర్తాకర్ను ‘బి’నుంచి ‘సి’ కేటగిరీకి మార్చారు. మ్యాచ్ ఫీజుతోపాటు ‘ఎ’ కేటగిరీ ఆటగాళ్లకు యేడాదికి రూ.50 లక్షలు, ‘బి’ కేటగిరీకి రూ.30 లక్షలు, ‘సి’ కేటగిరీకి రూ.10 లక్షలు చెల్లిస్తారు.