BCCI Central Contracts | బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో పలువురు సీనియర్ క్రికెటర్లు కనుమరుగయ్యారు. వీళ్లల్లో ఏదో అనామక పేర్లు ఉన్నా అంతగా పట్టించుకోవాల్సిన పన్లేదు గానీ కాంట్రాక్టులు కోల్పోయినవారంతా స్టార్ క్రికెటర్లే కావడం గమనార్హం. 2023-24 కాలానికి గాను సెంట్రల్ కాంట్రాక్టులు పొందిన 30 మందితో కూడిన జాబితాను ప్రకటించిన బీసీసీఐ.. సీనియర్ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ వంటి క్రికెటర్లకు షాకిచ్చింది. మొత్తంగా గతేడాది కాంట్రాక్టు పొంది ఈ ఏడాది వాటిని తిరిగి దక్కించుకోవడంలో విఫలమైన క్రికెటర్లు 9 మంది ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
గతేడాది కాంట్రాక్టులు ఉన్నా ఈ ఏడాది రిటైన్ చేసుకోలేనివాళ్లు..
అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్
కెరీర్ ముగిసినట్టేనా..?
పైన పేర్కొన్నవారిలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల సంగతి పక్కనబెడితే పుజారా, రహానే, ధావన్, ఉమేశ్ల కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అన్న వాదనలు వినపడుతున్నాయి. పూర్తి టెస్టు స్పెషలిస్టులు అయిన పుజారా, రహానేలను భారత్ గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నుంచి పూర్తిగా పక్కనబెట్టింది. శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ క్రికెటర్లు కుదురుకుంటున్న తరుణంలో ఇక ఈ ఇద్దరు సీనియర్లకు చోటు దక్కుతుందనుకోవడం అతిశయోక్తే. పుజారా, రహానేతో పాటు ఉమేశ్ యాదవ్ కూడా చివరిసారగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనే ఆడాడు. ఈ ముగ్గురూ దేశవాళీలో అడపాదడపా మెరుస్తున్నా సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం వీరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఇక ధావన్ విషయానికొస్తే 2018లోనే టెస్టు జట్టుకు దూరమైన గబ్బర్.. 2022లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో ఆడాడు. కొంతకాలం పాటు ద్వితీయ శ్రేణి భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన ధావన్.. గతేడాది గ్రేడ్ సీ కాంట్రాక్టు పొందినా ఒక్క మ్యాచ్ ఆడలేదు. గిల్ రాకతో ధావన్ ఓపెనింగ్ బెర్త్ భర్తీ అయింది. ఈ నలుగురికి ఇక భారత క్రికెట్ జట్టులో నూకలు చెల్లినట్టే అన్నది బీసీసీఐ చెప్పకనే చెప్పింది.
చాహల్కూ నిరాశే..
వీళ్లందరి కథ ఎలా ఉన్నా పరిమిత ఓవర్ల క్రికెట్లో నమ్మదగిన స్పిన్నర్గా ఉన్న యుజ్వేంద్ర చాహల్ కూడా కాంట్రాక్టు కోల్పోవడం ఆశ్చర్యకరం. గతేడాది వన్డే వరల్డ్ కప్ వరకూ భారత జట్టులో రెగ్యులర్ మెంబర్ అయిన చాహల్.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డేలలో అతడి ప్లేస్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్తో ఆడుతున్న భారత్.. టీ20లలో రవి బిష్ణోయ్ను ప్రమోట్ చేస్తోంది. మరి చాహల్ ఇకపై భారత జట్టులో కనబడడా..? అన్నది చర్చనీయాంశం. ఇక దీపక్ చాహర్, దీపక్ హుడాలు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. వీళ్లు దేశవాళీలో రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండొచ్చు.
ప్రమోషన్, డిమోషన్ అయినవాళ్లు వీళ్లే..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో పలువురు ఆటగాళ్లు తమ గ్రేడ్లు మారారు. ఆ జాబితా ఇదే..
ప్రమోషన్..
కేఎల్ రాహుల్ – గతేడాది గ్రేడ్ బీ.. ఇప్పుడు గ్రేడ్ ఏ
మహ్మద్ సిరాజ్ – గ్రేడ్ బీ.. గ్రేడ్ ఏ
శుభ్మన్ గిల్ – గ్రేడ్ బీ.. గ్రేడ్ ఏ
కుల్దీప్ యాదవ్ – గ్రేడ్ సీ.. గ్రేడ్ బీ
డిమోషన్..
రిషభ్ పంత్ – గ్రేడ్ ఏ.. గ్రేడ్ బీ
అక్షర్ పటేల్ – గ్రేడ్ ఏ.. గ్రేడ్ బీ
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల ఫుల్ లిస్ట్..
గ్రేడ్ ఏ + : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ : రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్ధిక్ పాండ్యా
గ్రేడ్ బీ : సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్
గ్రేడ్ సీ : రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్