హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆఫీస్ బేరర్ల ఓటింగ్ శుక్రవారమే కావడంతో.. ఎన్నికల బరిలో ఉన్న నాలుగు ప్యానల్స్ తమ ప్రయత్నాలు వేగవంతం చేశాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న జాతీయ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అర్శనపల్లి జగన్మోహన్రావు అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి తన ప్యానల్ను రేసులో నిలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ రెండు ప్యానల్స్ నడుమే ప్రధానంగా పోటీ కనిపిస్తున్నది.
శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్సీఏ ఓటర్ల జాబితాలో 48 మంది ఇనిస్టిట్యూషన్స్, 9 ఉమ్మడి జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత అండదండలు ఉన్న జగన్మోహన్ రావు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తున్నది.
ఎన్నికల్లో ఇన్స్టిట్యూషన్స్తో పాటు జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వ సూచనల మేరకే ఓటు హక్కు వినియోగించుకోవడం సంప్రదాయం కాగా.. 101 క్లబ్ సెక్రటరీలలో అధిక శాతం మంది జగన్ ప్యానల్కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్తో పాటు.. పీఎల్ శ్రీనివాస్ ప్యానల్లు కూడా పోటీలో ఉన్నా.. ప్రధానంగా జగన్ వర్గానికి, వివేక్ ప్యానల్కు మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హెచ్సీఏ ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు మెంబర్షిప్పై సందిగ్ధత నెలకొంది. హెచ్సీఏ నుంచి ఆమోదం పొందిన వ్యక్తి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ (టీహెచ్బీఏ)లో సభ్యుడు కాదని టీహెచ్బీఏ ఒక ప్రకటనలో తెలిపింది.