సమిష్టి క్రీడైన క్రికెట్ను పక్కనపెట్టి.. సోలో పర్ఫార్మెన్స్కు ప్రాముఖ్యతనిస్తూ టెన్నిస్ను కెరీర్గా ఎంచుకున్న ఆష్లె బార్టీ.. వింబుల్డన్ టైటిల్ చేజిక్కించుకుంది. టాప్సీడ్గా బరిలోకి దిగిన బార్టీ తిరుగులేని ఆటతో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఆల్రౌండర్.. ప్లిస్కోవాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. దశాబ్దం క్రితం ఆల్ఇంగ్లండ్ క్లబ్లో జూనియర్ టైటిల్ నెగ్గిన బార్టీ.. ఇప్పుడు సీనియర్ విభాగంలోనూ విజేతగా నిలిచి శెభాష్ అనిపించుకుంది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్లో బెర్టినితో హాట్ ఫేవరెట్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు.
లండన్: ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసే వ్యూహాన్ని మరోసారి పక్కాగా అమలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆష్లె బార్టీ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ బార్టీ 6-3, 6-7 (4/7), 6-3తో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్ (2019) నెగ్గిన బార్టీకి ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. ఆల్ఇంగ్లండ్ క్లబ్లో 1980 తర్వాత టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా మహిళగా బార్టీ రికార్డుల్లోకెక్కింది. గంటా 55 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 7 ఏస్లు సంధించిన బార్టీ.. 30 విన్నర్లు కొట్టగా.. 6 ఏస్లు కొట్టిన ప్లిస్కోవా 31 అనవసర తప్పిదాలతో ఓటమిని ఆహ్వానించింది.
రెండో సెట్ కోల్పోయినా..
జూనియర్ వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన తర్వాత టెన్నిస్కు దూరమై క్రికెట్ బ్యాట్ పట్టిన బార్టీ.. మహిళల బిగ్బాష్లీగ్తో అభిమానులను అలరించింది. ఆ తర్వాత తిరిగి క్రికెట్ క్రీజ్ నుంచి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన బార్టీ.. ఫైనల్లో బలమైన బ్యాక్హ్యాండ్ షాట్లతో చెలరేగిపోయింది. కోర్టులో అడుగుపెట్టడంతోనే ప్రత్యర్థిపై విరుచుకుపడిన ఈ ఆస్ట్రేలియా చిన్నది తొలి 14 పాయింట్లు నెగ్గి ప్లిస్కోవాపై మానసికంగా పైచేయి సాధించింది. తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న బార్టీకి రెండో సెట్లో ప్లిస్కోవా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ క్రమంలో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన ప్లిస్కోవా రెండో సెట్ నెగ్గి పోటీలోకి వచ్చింది. అయితే మూడో సెట్ ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కొనసాగించిన బార్టీ 3-0తో ముందంజలో నిలువడంతో పాటు అలవోకగా సెట్ చేజిక్కించుకొని టైటిల్ ముద్దాడింది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన ప్లిస్కోవా.. మరోసారి రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది.
ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన నొవాక్ జొకోవిచ్ మూడో టైటిల్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం ఇక్కడి సెంటర్ కోర్టులో జరుగనున్న వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఏడోసీడ్ బెర్టిని (ఇటలీ)తో జొకోవిచ్ తలపడనున్నాడు. పురుషుల టెన్నిస్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ (20 టైటిల్స్)కు ఒక్క అడుగు దూరంలో ఉన్న జొకోవిచ్ (19 టైటిల్స్) ఈ విజయంతో వారి సరసన చేరాలని పట్టుదలతో ఉన్నాడు. 2018 నుంచి వింబుల్డన్లో వరుసగా 20 మ్యాచ్ల్లో గెలిచి మంచి జోరుమీదున్న జొకోను.. తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న బెర్టిని ఏమాత్రం అడ్డుకోగలడో చూడాలి. ఏడోసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టిన జొకోవిచ్.. ఇప్పటికే ఐదు టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు. గత రెండు సీజన్లలోనూ విజేతగా నిలిచిన జొకో.. ఈసారి సిక్సర్ కొట్టాలని తహతహలాడుతున్నాడు.
తొలి మహిళా చైర్ అంపైర్
వింబుల్డన్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ ఫైనల్కు ఓ మహిళ చైర్ అంపైర్గా విధులు నిర్వర్తించనుంది. క్రొయేషియాకు చెందిన 43 ఏండ్ల మరిజా సియాచ్ ఆదివారం జొకోవిచ్, బెర్టిని మధ్య జరుగనున్న ఫైనల్కు చైర్ అంపైర్గా వ్యవహరించనుంది.