ఢాకా: టీ20 ప్రపంచకప్లో దారుణ వైఫల్యం తర్వాత తొలి వన్డే సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వచ్చిన పాకిస్థాన్కు మరోసారి చుక్కెదురైంది. ఇరుజట్ల మధ్య ఢాకాలో బుధవారం జరిగిన మొదటి వన్డేలో షహీన్ షా అఫ్రిది సారథ్యంలోని పాకిస్థాన్ను.. ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్లో1-0 ఆధిక్యం సాధించింది. యువ పేసర్ నహీద్ రాణా (24/5) పేస్ ధాటికి మెన్ ఇన్ గ్రీన్.. 30.4 ఓవర్లకు 114 పరుగులకే చాపచుట్టేసింది. లోయరార్డర్ బ్యాటర్ ఫహీమ్ అష్రఫ్ (37) టాప్ స్కోరర్.
పాక్ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రాణాకు తోడు కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (3/29) కూడా రాణించడంతో ప్రత్యర్థి కుదేలైంది. ఓపెనర్లు ఫర్హాన్ (27), సదాకత్ (18) తొలి వికెట్కు 41 రన్స్ జోడించినా రాణా ఎంట్రీతో పాక్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అనంతరం ఛేదనను బంగ్లా.. 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి పూర్తిచేసింది. తంజిద్ హాసన్ (62 నాటౌట్), నజ్ముల్ హోసేన్ (27) రాణించారు. రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.