BAN vs SL |స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో బంగ్లాదేశ్.. పర్యాటక జట్టుకు షాకిచ్చింది. టీ20 సిరీస్ను కోల్పోయిన బంగ్లా పులులు.. వన్డేలలో మాత్రం 2-1 తేడాతో లంకేయులపై గెలిచారు. చిత్తోగ్రమ్ వేదికగా సోమవారం ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్.. 40.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ తాంజిద్ హసన్ (81 బంతుల్లో 84, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు రిషద్ హోసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో బంగ్లా మ్యాచ్తో పాటు సిరీస్నూ గెలుచుకుంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక టాపార్డర్ విఫలమైంది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్లు విజృంభించడంతో ఆ జట్టు ఒక దశలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ జనిత్ లియాంగె (101 నాటౌట్) సెంచరీతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఛేదనలో బంగ్లా కూడా తడబడినా తాంజిద్, ముస్తాఫిజుర్ (37 నాటౌట్), మెహిది హసన్ మిరాజ్ (25)లు రాణించి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.
𝐖𝐈𝐍𝐍𝐄𝐑𝐒!🏆
Congratulations Tigers on winning the ODI series 2-1 🇧🇩👏#BCB #Cricket #BANvSL #BDCricket #LiveCrcket #Bangladesh #HomeSeries #odiseries pic.twitter.com/DKVRnXWgX0— Bangladesh Cricket (@BCBtigers) March 18, 2024
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న లంక.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో నెగ్గగా వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలుచుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లు ముగిసిన నేపథ్యంలో ఈనెల 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగాల్సి ఉంది. మార్చి 30న రెండో టెస్టు జరగాల్సి ఉంది.