ఆసియాకప్లో ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మితిమీరిన మార్పులే రోహిత్సేనను దెబ్బకొట్టగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ వృథా అయింది. మొత్తానికి సంతృప్తికర విజయంతో బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కొలంబో: ఆసియాకప్లో టీమ్ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. టోర్నీలో అప్రతిహత విజయాలతో తుదిపోరుకు చేరిన రోహిత్ సేన శుక్రవారం చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడింది. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ఇండియా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తౌహిద్ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నసుమ్ అహ్మద్ (44; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ 3, షమీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (121; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. కెప్టెన్ రోహిత్ (0), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (5), కేఎల్ రాహుల్ (19), ఇషాన్ కిషన్ (5), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ 3, తన్జిమ్ హసన్, మెహదీ హసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షకీబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
బంగ్లాదేశ్: 265/8 (షకీబ్ 80, తౌహిద్ 54; శార్దూల్ 3/65, షమీ 2/32),
భారత్: 49.5 ఓవర్లలో 259 ఆలౌట్ (గిల్ 121, అక్షర్ 42; ముస్తఫిజుర్ 3/50, తన్జిమ్ 2/32).
ఈ ఏడాది అంతర్జాతీయ వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు.
వన్డే క్రికెట్లో 200 వికెట్లు, 2500 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా రవీంద్ర జడేజా రికార్డుల్లోకెక్కాడు. హర్యానా హరికేన్ కపిల్దేవ్ (253 వికెట్లు, 3783 పరుగులతో) అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత్ నుంచి వన్డేల్లో రెండొందల వికెట్లు తీసిన ఏడో బౌలర్గా జడేజా నిలిచాడు. కుంబ్లే (334), శ్రీనాథ్ (315), అగార్కర్ (288), జహీర్ఖాన్ (269), హర్భజన్ (265), కపిల్దేవ్ (253) ముందున్నారు.
వన్డే ప్రపంచకప్నకు ఎక్కువ సమయం లేకపోవడంతో జట్టు కుదురుకునే ప్రయత్నాలు చేయడానికి బదులు భారత మేనేజ్మెంట్ ప్రయోగాలకు తెరతీసింది. ఫలితంతో పెద్దగా సంబంధం లేకపోవడంతో ఈ మ్యాచ్లో భారీ మార్పులతో బరిలోకి దిగింది. వర్క్ లోడ్ను దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్కృష్ణ, షమీ జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రేయస్ మూడో మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు.
తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. గత నెల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. టీ20 సిరీస్లో దుమ్మురేపిన తిలక్ను ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆసియాకప్నకు ఎంపిక చేయగా.. శుక్రవారం పోరులో తొలిసారి అతడికి తుది జట్టులో చోటు దక్కింది. రోహిత్సేన ఇప్పటికే ఆసియాకప్ ఫైనల్కు చేరడంతో ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ప్రభావం ఉండని నేపథ్యంలో.. మేనేజ్మెంట్ పలు ప్రయోగాలు చేసింది. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ప్లేయర్లకు విశ్రాంతి నిచ్చి వారి స్థానాల్లో అవకాశం రానివారిని బరిలో దింపింది. ఈ క్రమంలో తొలి వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు..
మ్యాచ్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ క్యాప్ అందించి టీమ్లోకి స్వాగతం పలికాడు. దేశవాళీల్లో ఆల్రౌండర్గా రాణించిన తిలక్ వర్మ తన తొలి వన్డేలోనే ఎలాంటి తడబాటు లేకుండా బౌలింగ్ చేయడం టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన తిలక్ 21 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. అటు ఫీల్డింగ్లోనూ ఈ హైదరాబాదీ తన చురుకుదనం కనబర్చాడు. షమీ బౌలింగ్లో తౌహిత్ క్యాచ్ను చక్కగా అందుకున్నాడు. అయితే బౌలింగ్లో ఫర్వాలేదనిపించిన తిలక్ బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్.. బంతిని తప్పుగా అంచనావేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో 5 పరుగులు చేసిన తిలక్.. ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తుందని భావించి బంతిని వదిలేయగా.. అది కాస్తా ఆఫ్ స్టంప్ బెయిల్ను గిరాటేసింది. దీంతో తిలక్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన బంగ్లా పేసర్ తన్జిబ్ షకీబ్ బౌలింగ్లో తిలక్ ఔట్ కావడం కొసమెరుపు!
ఈ మ్యాచ్ నుంచి కోహ్లీకి విశ్రాంతి నివ్వగా.. అతడు వాటర్ బాయ్ అవతారంలో సందడి చేశాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్తో కలిసి సహచరులకు డ్రింక్స్ ఇచ్చేందుకు మైదానంలోకి వచ్చిన కోహ్లీ.. తన భిన్నమైన పరుగుతో నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.