పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఫీల్డింగ్ చేస్తుంటే.. మైదానంలోని ప్రేక్షకులు ఆసీస్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ పేరు జపం చేస్తూ కనిపించారు. బౌండరీ లైన్ వద్ద షహీన్ షా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ దృశ్యం కనిపించింది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. అయితే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆ జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ 19వ ఓవర్లో పాక్ పేసర్ షహీన్ షా బౌలింగ్ చేశాడు.
అదే ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన ఆసీస్ వికెట్కీపర్ మాథ్యూ వేడ్.. పాక్కు పరాభవం మిగిల్చాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న షహీన్ షాపై ఒత్తిడి తెచ్చేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు.
కాగా, టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ పోరులో పాక్ చేతిలో న్యూజిల్యాండ్ జట్టు ఓడిపోయినప్పుడు.. పాక్ అభిమానులు కూడా ’సెక్యూరిటీ.. సెక్యూరిటీ‘ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సెక్యూరిటీ కారణాల వల్ల పాక్ పర్యటనను న్యూజిల్యాండ్ జట్టు అర్ధంతరంగా రద్దు చేసుకుంది.