కథానాయిక రీతూవర్మకు మంచి అవకాశాలైతే వస్తున్నాయి కానీ..ఆ మేరకు విజయాలు మాత్రం దక్కడం లేదు. అయితే నటనాపరంగా చక్కటి ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తూ కెరీర్లో రాణిస్తున్నది. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్ను దక్కించుకుంది. అగ్ర హీరో గోపీచంద్ సరసన కథానాయికగా ఖరారైంది. సంకల్ప్ రెడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్తో హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో రీతూవర్మ 7వ శతాబ్దానికి చెందిన సత్యవతి అనే చారిత్రక యోధురాలు పాత్రలో కనిపించనుంది. మంగళవారం రీతూవర్మ జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆమె విల్లు ఎక్కుపెట్టి సమరానికి సిద్ధమన్నట్లుగా కనిపిస్తున్నది. తీక్షణమైన ఆమె చూపులు పాత్ర తాలూకు పవర్ను సూచిస్తున్నాయి. గిరిజన తెగ తాలూకు సంస్కృతి, ధైర్యాన్ని ప్రతిబింబించేలా ఆమె పాత్ర సాగుతుందని, రీతూవర్మ కెరీర్లోనే ఉత్తమ పాత్రగా నిలుస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్రాజన్, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.