Odisha Masters: కటక్ వేదికగా జరుగుతున్న ఒడిషా మాస్టర్స్లో భాగంగా పురుషుల సింగిల్స్ టైటిల్ భారత్కే దక్కనుంది. సెమీఫైనల్స్లో భారత్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అయూష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్లు తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ కాంస్య పతక విజేత అయూష్ శెట్టి.. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్లో 19-21, 21-14, 22-20 తేడాతో ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హన్ ను ఓడించాడు. ఇదివరకే ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్లో సతీష్ కుమార్.. ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సెమీస్లో సతీష్.. భారత్కే చెందిన కిరణ్ జార్జ్ను ఓడించి ఫైనల్ చేరాడు.
18 ఏండ్ల అయూష్కు అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి సూపర్ 100 ఫైనల్. శనివారం అల్వితో జరిగిన పోరులో తొలి సెట్ ఓడినా రెండో సెట్లో పుంజుకున్న అయుష్ ఆ సెట్ను గెలుచుకున్నాడు. ఇక చివరి సెట్ హోరాహోరిగా సాగింది. అయుష్ ఫైనల్ చేరడంతో ఇరువురిలో ఎవరు గెలిచినా పురుషుల సింగిల్స్లో టైటిల్ మాత్రం భారత్కే దక్కనుంది.