కివీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శన చేసిన బౌలర్ అక్షర్ పటేల్. ఐదు వికెట్లతో న్యూజిల్యాండ్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డివిరిచాడతను. మ్యాచ్లో కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు ఆధిపత్యాన్ని అందించాడు. క్యాచ్ అందుకొని మరో వికెట్ కూల్చడంలో కూడా భాగస్వామి అయ్యాడు.
ఇలా మ్యాచ్ మూడో రోజున అన్నీ సక్రమంగా చేసిన అక్షర్.. ఒక్క తప్పు చేశాడట. దాన్ని గుర్తించిన మాజీ ఆటగాడు వసీం జాఫర్.. తన స్టైల్లో అక్షర్ను ట్రోల్ చేశాడు. ఈ మ్యాచ్లో అక్షర్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో మ్యాచ్ అనంతరం బంతిపై మ్యాచ్ జరిగిన తేదీ, అతని బౌలింగ్ గణాంకాలు రాశారు.
అయితే ఇక్కడే అక్షర్ పొరబడ్డాడు. మ్యాచ్ జరిగింది శనివారం (27 నవంబరు) కానీ ఆ బంతిపై 27 అక్టోబరు అని రాశాడు. దీన్నే ఎత్తిచూపిన వసీం జాఫర్.. ‘ఈరోజు అక్షర్ చేసిన ఒకే ఒక్క పొరపాటు.. మ్యాచ్ బాల్పై తప్పు డేట్ వేయడం. ఇది 27 నవంబర్ బాబూ’ అంటూ ట్రోల్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన అక్షర్ కూడా జరిగిన తప్పు గ్రహించాడు. అయితే ఆ బంతిపై డేట్ వేసింది తాను కాదని, జట్టు సహచరుడు సూర్యకుమార్ యాదవ్ అని వివరణ ఇచ్చాడు. ఏదిఏమైనా జాఫర్ చేసిన ట్రోల్తో నెట్టింట తెగనవ్వులు పూస్తున్నాయి.