భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న కాన్పూర్ పోరులో కివీస్పై భారత్ పట్టు బిగిస్తున్నది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఐదు వికెట్ల విజృంభణకు తోడు అశ్విన్ రాణింపుతో కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు లాథమ్, యంగ్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సుడులు తిరిగే స్పిన్తో అక్షర్, అశ్విన్ ప్రత్యర్థి పనిపట్టారు. 49 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్..గిల్ వికెట్ కోల్పోయింది. రెండు రోజులు మిగిలున్న టెస్టులో ఫలితం ఎవరికి అనుకూలమన్నది ఆసక్తికరంగా మారింది.
కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఓవైపు భారత్ చెలరేగుతుంటే.. కివీస్ అంతే దీటుగా రాణిస్తూ పోటీని రంజుగా మారుస్తున్నది. రెండో రోజు వికెట్ కోల్పోకుండా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన కివీస్ బ్యాటర్లు మూడో రోజు ఆ జోరును కొనసాగించలేకపోయారు. 49 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు దిగిన టీమ్ఇండియా శనివారం ఆట ముగిసే సమయానికి శుభ్మన్ గిల్(1) వికెట్ కోల్పోయి ఐదు ఓవర్లలో 14 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(4 నాటౌట్), పుజార(9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. గిల్ మరోమారు..జెమీసన్ వలలో చిక్కాడు. లోపలికి దూసుకొచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన గిల్.. క్లీన్బౌల్ట్గా వెనుదిరిగాడు. రోజురోజుకు పిచ్పై బంతులు తక్కువ ఎత్తులో వస్తున్న క్రమంలో నాలుగో ఇన్నింగ్స్లో కివీస్కు అంత సులువైన పరిస్థితులు ఉండకపోవచ్చు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు(129/0)తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్లు టామ్ లాథమ్(282 బంతుల్లో 95, 10ఫోర్లు), విల్ యంగ్(214 బంతుల్లో 89, 15 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ రాణింపుతో భారీ స్కోరు దిశగా బాటలు వేస్తున్న కివీస్ను లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్(5/62), అశ్విన్(3/82) దెబ్బ తీశారు. సుడులు తిరిగే స్పిన్తో కివీస్ బ్యాటర్ల నడ్డివిరిచారు. లంచ్ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చి.. మ్యాచ్ను మన వైపు తిప్పారు. వీరి స్పిన్ ధాటికి కివీస్ 99 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా అక్షర్ తనదైన స్పిన్ తంత్రంతో కివీస్ బ్యాటర్లను ఆడుకున్నాడు. రాస్ టేలర్తో మొదలుపెట్టిన అక్షర్ వికెట్ల జోరు సౌథీ వరకు కొనసాగింది. ఓవైపు ఊరించే బంతులు సంధిస్తూనే.. ఆఫ్స్టంప్, మిడిల్స్టంప్ను పటేల్ లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ల దగ్గర సరైన సమాధానం లేకుండా పోయిం ది. దీనికి తోడు సాహా స్థానంలో కీపింగ్కు వచ్చిన భరత్.. ఆకట్టుకున్నాడు. లోలెవల్లో వస్తున్న బంతులను నేర్పుగా ఒడిసిపట్టుకుంటూ మ్యాచ్ను మలుపుతిప్పడంలో కీలక భూమిక పోషించాడు. ఇదిలా ఉంటే ఆడిన నాలుగు టెస్టుల్లో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అరుదైన రికార్డును అక్షర్ సొంతం చేసుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (1/50), జడేజా (1/57) ఒక్కో వికెట్ తీశారు.
అక్షర్ పటేల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. తక్కువ టెస్టు(4)ల్లో ఐదు సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టిన ఘనత దక్కించుకున్నాడు. సౌథీ వికెట్ తీయడం ద్వారా నాలుగు టెస్టుల్లో అక్షర్ 32 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టామ్ రిచర్డ్సన్(ఇంగ్లండ్), రాడ్నీ హగ్(ఆస్ట్రేలియా) సరసన పటేల్ నిలిచాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 345 ఆలౌట్; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్
(స్టంప్/సబ్-భరత్)(బి)అక్షర్ 95, యంగ్(సి/సబ్-భరత్)(బి)అశ్విన్ 89, విలియమ్సన్(ఎల్బీ) ఉమేశ్ యాదవ్ 18, టేలర్(సి/సబ్-భరత్)(బి)అక్షర్ 11, నికోల్స్(సి)ఎల్బీ అక్షర్ 2, బ్లండెల్(బి) అక్షర్ 13, రవీంద్ర(బి)జడేజా 13, జెమీసన్(సి)అక్షర్(బి)అశ్విన్ 23, సౌథీ(బి)అక్షర్ 5, సోమర్విల్లే(బి)అశ్విన్ 6, అజాజ్ 5 నాటౌట్; ఎక్స్ట్రాలు: 16; మొత్తం: 142.3 ఓవర్లలో 296 ఆలౌట్; వికెట్ల పతనం: 1-151, 2-197, 3-214, 4-218, 5-227, 6-241, 7-258, 8-270, 9-284, 10-296; బౌలింగ్: ఇషాంత్ 15-5-35-0, ఉమేశ్ 18-3-50-1, అశ్విన్ 42.3-10-82-3, జడేజా 33-10-57-1, అక్షర్ పటేల్ 34-6-62-5.
భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ 4 నాటౌట్, గిల్(బి)జెమీసన్ 1, పుజార 9 నాటౌట్; ఎక్స్ట్రాలు: 0; మొత్తం: 5 ఓవర్లలో 14/1; వికెట్ల పతనం: 1-2; బౌలింగ్: సౌథీ 2-1-2-0, జెమీసన్ 2-0-8-1, అజాజ్ పటేల్ 1-0-4-0.