గోల్డ్కోస్ట్: భారత్- ఆస్ట్రేలియా మహిళల జట్లు పొట్టి పోరుకు సిద్ధమయ్యాయి. గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. వన్డే సిరీస్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో టీమ్ఇండియా ఉంటే..సొంతగడ్డపై సత్తాచాటేందుకు కంగారూలు కసిగా ఉన్నారు. అయితే గులాబీ బంతితో ఏకైక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో ఆసీస్కు దీటైన పోటీనిచ్చిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. దీనికి తోడు గాయంతో వన్డే, టెస్టు సిరీస్లకు దూరమైన కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ తిరిగి జట్టులోకి రావడం కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. గులాబీ టెస్టులో సూపర్ సెంచరీతో కదంతొక్కిన స్మృతి మందన ఫామ్లో ఉండటం టీమ్ఇండియాకు బాగా కలిసిరానుంది. మరోవైపు కొట్టిన పిండిల్లాంటి సొంతపిచ్లపై కంగారూలు దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది. ఆసీస్పై సిరీస్ గెలిచి ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగుతామని హర్మన్ప్రీత్కౌర్ ధీమా వ్యక్తం చేసింది.
భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, యాస్తిక భాటియా, శిఖా పాండే, మేఘన సింగ్, పూజ వస్ర్తాకర్, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రేణుక సింగ్.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్),డార్సీ బ్రౌన్, మైట్లాన్ బ్రౌన్, స్టెల్లా కాంప్బెల్, నికోలా కారె, డార్లింగ్టన్, గార్డ్నర్, అలిస్సా హిలీ, మెక్గ్రాత్, మోలినిక్స్, బెత్ మూనీ, ఎలీస్ పెర్రీ, జార్జియా రెడ్మన్, మోల్లీ స్ట్రానో, అన్నాబెల్ సదర్లాండ్, వ్లామింక్, జార్జియా వారెహమ్.