నిలదొక్కుకోవడం కంటే.. ఎదురుదాడికి దిగడం మేలని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మెరుగైన స్కోరు చేసింది. భారత బౌలర్లు సత్తాచాటినా.. మొండిగా క్రీజులో నిల్చోవడమే కాకుండా.. వేగంగా ఆడుతూ వీలైనన్ని పరుగులు రాబట్టిన కంగారూలు మొన్నటి కంటే మంచి ప్రదర్శన కనబర్చారు. ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్ అర్ధశతకాలతో ఆసీస్కు మోస్తారు స్కోరు లభించగా.. తొలి రోజు పెద్దగా సహకరించని పిచ్పై మన బౌలర్లు ఫర్వాలేదనిపించారు. షమీ 4 వికెట్లు పడగొట్టగా అశ్విన్, జడ్డూ చెరో ముగ్గుర్ని పెవిలియన్ చేర్చారు. బౌలర్ల బాధ్యత తీరగా ఇక ఢిల్లీ టెస్టులో భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది!
న్యూఢిల్లీ: భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ప్రారంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, ఒక సిక్సర్), పీటర్ హ్యాండ్స్కోంబ్ (142 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడుతూ విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ప్రత్యర్థి స్కోరుకు 242 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్ ఆరంభానికి ముందు వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్ పుజారాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జ్ఞాపిక అందజేశాడు. వందో టెస్టులో శతకం చేసిన తొలి భారత ఆటగాడిగా పుజారా నిలువాలని సన్నీ ఆకాంక్షించాడు.
టాస్ గెలిచి వరుసగా రెండోసారి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఈసారి శుభారంభం దక్కింది. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ (15) సంయమనంతో ఆడారు. పేసర్లను ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను శిక్షించిన ఈ జోడీ తొలి వికెట్కు 50 పరుగులు జోడించింది. కుదురుకున్నట్లు కనిపించిన వార్నర్ను షమీ బుట్టలో వేసుకోగా.. ఆసీస్కు అసలు దెబ్బ అశ్విన్ కొట్టాడు. లంచ్కు ముందు ఓవర్లో లబుషేన్ (18), స్టీవ్ స్మిత్ (0)ను ఔట్ చేయడంతో ఆ జట్టు 91/3తో నిలిచింది. ట్రావిస్ హెడ్ (12), అలెక్స్ కారీ (0) విఫలం కాగా.. ఖవాజాతో కలిసి హ్యాండ్స్కోంబ్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరి పోరాటంతో జట్టు మంచి స్కోరు దిశగా సాగగా.. కెప్టెన్ కమిన్స్ మెరుపులు మెరిపించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263 (ఉస్మాన్ ఖవాజా 81, హ్యాండ్స్కోంబ్ 72 నాటౌట్; షమీ 4/60, అశ్విన్ 3/57), భారత్ తొలి ఇన్నింగ్స్: 21/0 (రోహిత్ 13 బ్యాటింగ్, రాహుల్ 4 బ్యాటింగ్).