పల్లెకెలె: టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 దశకు అర్హత సాధించలేక గ్రూప్ దశలోనే వెనుదిరిగిన మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా.. టోర్నీని విజయంతో ముగించింది. గ్రూప్-బీలో శుక్రవారం పల్లెకెలెలో జరిగిన ఈ టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో కంగారూలు.. ఒమన్పై 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆసీస్ ఆధిపత్యం ముందు ఒమన్ తేలిపోయింది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. 16.2 ఓవర్లలో 104 పరుగులకే చేతులెత్తేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఆడమ్ జంపా (4/21), గ్లెన్ మ్యాక్స్వెల్ (2/13) స్పిన్ మాయాజాలానికి ఒమన్ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వసీమ్ అలీ (32) టాప్ స్కోరర్. స్కోరుబోర్డుపై పరుగులేమీ చేరకుండానే వికెట్ల ఖాతా తెరిచిన ఒమన్.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కంగారూలకు కనీస పోటీని ఇవ్వలేకపోయింది. ఛేదనను ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో ఆసీస్ రెండు గెలిచి రెండింట ఓడింది.
మార్ష్ ధనాధన్
స్వల్ప ఛేదనలో ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 32, 6 ఫోర్లు) ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగి మెరుపులు మెరిపించారు. మొదటి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదిన మార్ష్.. వసీమ్ ఓవర్లో 4, 6, 4, 4తో 26 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించాడు. షకీల్ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హెడ్ ఔటైనా ఇంగ్లిస్ (12*) అండతో మార్ష్ లాంఛనం పూర్తిచేశాడు.
సూపర్-8లో ఇలా..
టీ20 ప్రపంచకప్లో లీగ్ దశ ముగియడంతో శనివారం నుంచి సూపర్-8 దశ మొదలుకానుంది. గ్రూప్-2లో కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్తో సూపర్-8 ఆరంభమవనుంది. ఈ దశలో రెండు గ్రూపులుగా విడిపోయిన 8 జట్లు.. తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ (మొత్తం 3) ఆడతాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 దాకా జరిగే ఈ పోటీల్లో.. శ్రీలంకలో ఆరు (కొలంబో, పల్లెకెలెల్లో), భారత్లో ఆరు (అహ్మదాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ) మ్యాచ్లను నిర్వహించనున్నారు. గ్రూప్-1లో టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే తమ అన్ని మ్యాచ్లను భారత్లోనే ఆడనుండగా గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ లంకలో తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.
భారత షెడ్యూల్:
ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికాతో.. అహ్మదాబాద్లో
ఫిబ్రవరి 26:జింబాబ్వేతో.. చెన్నైలో
మార్చి 01:వెస్టిండీస్తో.. కోల్కతాలో
(అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి)