న్యూఢిల్లీ: సమాజంలో ఆడ పిల్లల పట్ల తల్లిదండ్రుల మనస్తత్వం మారాలని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ అంది. టర్కీ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించిన తొలి తెలంగాణ బాక్సర్గా నిలిచిన నిఖత్కు తగిన గౌరవం దక్కింది. టర్కీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన జరీన్తో పాటు పర్వీన్, మనీషాను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) మంగళవారం సన్మానించింది.
ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ ‘ఆడ పిల్ల పుడితే సమాజంలో ఇప్పటికీ కొంతమంది అయిష్టపడుతున్నారు. కానీ కూతురు జన్మిస్తే ఆ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చినట్లు నేను భావిస్తాను. ప్రస్తుత సొసైటీలో అమ్మాయిలు అన్ని రంగాల్లో అద్భుత రాణిస్తూ కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా చేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మాయిల పట్ల మనస్తత్వం మారాలి.
భవిష్యత్లో డాక్టర్, పోలీస్, బాక్సర్గా ఏది కావాలనుకుంటున్నారో వారి కలలను సాకారం చేసుకోనివ్వండి. మద్దతు ఇవ్వడం ద్వారా వారు మిమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతారు. ఎందులోనైనా అమ్మాయిలు, అబ్బాయిలు సమానం. అబ్బాయిల వలే అమ్మాయిలు కూడా ధైర్యవంతులు’ అని జరీన్ అంది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.