దుబాయ్: టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత బౌలర్ షమీపై ఆన్లైన్ ట్రోలింగ్ సాగింది. విపరీతమైన కామెంట్లతో కొందరు షమీని టార్గెట్ చేశారు. అయితే ఆ ఆన్లైన్ ట్రోల్స్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్లో జరుగుతున్న ట్రోలింగ్కు షమీ బాధితుడయ్యాడని పేర్కొన్నాడు. షమీపై జరుగుతున్న ట్రోలింగ్ను ఖండిస్తూ.. తమ జట్టు ఆ బౌలర్కు అండగా ఉందన్నాడు. ఓ వ్యక్తిని మత ఆధారంగా టార్గెట్ చేయడం విషాదకరమని, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, కానీ మతం ఆధారంగా వివక్ష చూపడం వ్యక్తిగతంగా ఇష్టపడను అన్నట్లుగా కోహ్లీ తెలిపాడు. మహమ్మద్ షమీ ఇండియాకు ఎన్ని మ్యాచ్లను గెలిపించాడో ట్రోలర్స్కు తెలియదని, అతని పట్టుదలపై అవగాహన లేని వారు ఏదో అంటారని, అలాంటి వారిపై ఒక నిమిషం కూడా ఆలోచించమని, 200 శాతం షమీ వెంట తాము ఉన్నామని, మా సోదరభావాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరని కోహ్లీ అన్నాడు. ఆన్లైన్ ట్రోల్స్ చేస్తున్న వారు వెన్నుపూసలేని వ్యక్తులని, పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లు రాణిస్తారన్నాడు. ట్రోలింగ్ను వ్యతిరేకిస్తూ మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, యువీ, హర్జన్లు షమీకి అండగా నిలిచారు.