హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల జోడీ.. కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై 21-18, 21-16 తేడాతో గెలుపొంది స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. కొరియా జోడీ రజతంతో సరిపెట్టుకుంది.
కాగా, తాజా స్వర్ణంతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్కు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 26 కు పెరిగింది. మొత్తం పతకాల సంఖ్య 101గా ఉంది. అందులో 35 రజతాలు, 40 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. చైనా 354 పతకాలతో (187 స్వర్ణాలు, 104 రజతాలు, 63 కాంస్యాలు) అగ్ర స్థానంలో ఉండగా, జపాన్ 169 పతకాలతో (47 స్వర్ణాలు, 57 రజతాలు, 65 కాంస్యాలు) రెండో స్థానంలో, కొరియా 171 పతకాలతో (36 స్వర్ణాలు, 50 రజతాలు, 85 కాంస్యాలు) మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.