హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఈక్విస్ట్రియన్ టీమ్ చరిత్ర లిఖించింది. ఆసియా క్రీడల చరిత్రలో గత 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని నెగ్గింది. భారత్ చివరగా 1982లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. ఆ తర్వాత ఈ విభాగంలో భారత్కు గోల్డ్ మెడల్ దక్కడం ఇదే మొదటిసారి.
టీమ్ డ్రెస్సేజ్ ఈవెంట్లో భారత టీమ్ 209.205 స్కోర్తో అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 204.882 స్కోర్తో చైనా, 204.852 స్కోర్తో హాంగ్కాంగ్ (చైనా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. చారిత్రక విజయం సాధించిన ఈ టీమ్లో సుదీప్తి హజేలా, హృదయ్ విపుల్ చెదా, అనుష్ గార్వల్లా, దివ్యక్రితి సింగ్ ఉన్నారు.
కాగా, ఈ బంగారు పతకంతో కలిపి ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ విభాగంలో భారత్ మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించినట్లయ్యింది. మిగిలిన మూడు గోల్డ్ మెడల్స్ 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లోనే వచ్చాయి. రగ్విందర్ సింగ్ వ్యక్తిగత ఈవెంటింగ్ విభాగంలో, రూపిందర్ సింగ్ బ్రార్ వ్యక్తిగత టెంట్ పెగ్గింగ్ విభాగంలో బంగారు పతకాలు సాధించగా, టీమ్ ఈవెంటింగ్లో కూడా ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక ఆసియా క్రీడల చరిత్రలో ఈక్వెస్ట్రియన్ విభాగంలో మొత్తం పతకాల సంఖ్య 13కు చేరింది.