హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న అసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల్లో ఐదు పతకాలు దక్కించుకున్న షూటర్లు నాలుగో రోజైన బుధవారం ఏకంగా మరో ఐదు పతకాలు గెలిచారు. దాంతో షూటింగ్లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఇవాళ రెండు బంగారు , ఒక వెండి, రెండు కాంస్య పతకాలు సాధించారు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ సమ్రా కౌర్ 469.6 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేయడంతోపాటు బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ ఆషి చోక్సీ 451.9 స్కోర్తో కాంస్య పతకం దక్కించుకుంది. చైనాకు చెందిన షూటర్ జంగ్ 462.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది.
ఇక పురుషుల 50 మీటర్ల స్కీట్ షూటింగ్ విభాగంలోనూ భారత్ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. గురుజ్యోత్, అంగద్ వీర్, అనంత్ జీత్తో కూడిన పురుషుల జట్టు మంచి ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. దాంతో వారికి కాంస్య పతకం లభించింది. అంతకుముందు 50 మీటర్ల రైఫిల్ విభాగం (3 పొజిషన్స్)లో భారత మహిళా జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. షూటింగ్ త్రయం సిఫ్ట్ కౌర్ సమ్రా, మానిని కౌశిక్, ఆషి చోక్సీ తమ అద్భుత ప్రదర్శనతో భారత్కు రజతం అందించారు.
ఇక 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో మరో బంగారు పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఒక్క రోజే భారత్ షూటర్లకు రెండు బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలు దక్కాయి. కాగా ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.