హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ విజయపరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్ను 16-0 తేడాతో ఓడించిన భారత్.. ఇవాళ జరిగిన రెండో మ్యాచ్లో సింగపూర్ను 16-1 తేడాతో మట్టి కరిపించింది.
హాంగ్జౌలోని గోంగ్షూ కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆద్యంతం భారత జట్టుదే ఆధిపత్యం కొనసాగింది. హర్మన్ప్రీత్ సింగ్ 4, మన్దీప్ సింగ్ 3, అభిషేక్ 2, వరుణ్ కుమార్ 2 గోల్స్ చేశారు. అదేవిధంగా లలిత్ ఉపాధ్యాయ్, గుర్జంత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, మన్ప్రీత్ సింగ్, షంషేర్ సింగ్ ఒక్కో గోల్ కొట్టారు.
సింగపూర్ తరఫున మహమ్మద్ జాకీ బిన్ జుల్కర్నైన్ 53వ నిమిషంలో కన్సోలేషన్ గోల్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో సింగపూర్ సాధించిన గోల్ అది ఒక్కటే. దాంతో భారత్ 16-1 తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, భారత్ తర్వాత మ్యాచ్లో డిఫెండింగ్ ఆసియన్ గేమ్స్ చాంపియన్ జపాన్తో తలపడనుంది. ఈ నెల 28న (గురువారం) ఈ మ్యాచ్ జరుగనుంది.