న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆసియా టెక్నికల్ కమిటీ క్షమాపణ చెప్పింది. ఇటీవల ముగిసిన బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ సెమీఫైనల్లో సింధుపై అనవసరంగా ఒక పాయింట్ పెనాల్టీ వేయడం ‘మానవ తప్పిదమే’అని కమిటీ చైర్మన్ చైహ్ షెన్ చెన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సింధుకు లేఖ రాశారు. ‘అనుకోకుండా అలా జరిగింది. ఇకపై ఇలాంటి మానవ తప్పిదాలు జరుగకుండా జాగ్రత్తపడుతాం. మీకు (సింధు) కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం’అని అందులో పేర్కొన్నారు. అకానే యామగుచితో జరిగిన ఆసియా చాంపియన్షిప్ సెమీస్లో సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నదనే ఆరోపణతో సింధుపై ఒక పాయింట్ పెనాల్టీ వేశారు. కాగా.. టెక్నికల్ కమిటీ తప్పు తెలుసుకోవడం సంతోషంగా ఉందని సింధు తాజాగా పేర్కొంది.