ఆసియాకప్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక శుభారంభం చేసింది. బంగ్లాదేశ్తో జరిగిన పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన లంక 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్లో పతిరణ, తీక్షణ దుమ్మురేపితే.. బ్యాటింగ్లో అసలెంక, సమరవిక్రమ అర్ధశతకాలతో సత్తాచాటారు.
పల్లెకెలె: బౌలర్ల ప్రదర్శనకు బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆసియాకప్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ హుసేన్ షాంటో (89) ఒంటరి పోరాటం చేయగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (13), తన్జిద్ (0), మెహదీ హసన్ (5) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో పతిరణ 4, తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్లు చరిత అసలెంక (62 నాటౌట్), సదీర సమరవిక్రమ (54) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు.
దిముత్ కరుణరత్నె (1), కుషాల్ మెండిస్ (5), పాథుమ్ నిషాంక (14) విఫలమవడంతో ఒక దశలో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను సమరవిక్రమ, అసలంక ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 78 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. నాలుగు వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చిన పతిరణకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆరంభానికి ముందే ప్రధాన ఆటగాళ్లు వివిధ కారణాలతో దూరమవడంతో.. బలహీనంగా కనిపించిన లంక మ్యాచ్లో మాత్రం దుమ్మురేపింది. మొదట బౌలర్లు క్రమశిక్షణాయుత ప్రదర్శన కనబర్చగా.. ఆనక మిడిలార్డర్ బాధ్యతాయుతంగా ఆడింది.
బంగ్లాదేశ్: 42.4 ఓవర్లలో 164 ఆలౌట్(హుస్సేన్ 89, తౌహిద్ 20, పతిరణ 4/32, తీక్షణ 2/19), శ్రీలంక: 39 ఓవర్లలో 165/5(అసలెంక 62 నాటౌట్, సమరవిక్రమ 54, షకీబల్హసన్ 2/29, ఇస్లాం 1/23)