IND vs SL | కొలంబో: భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్పై ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. గత ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో లంకను 50 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. స్టేడియంలో ఇంకా ప్రేక్షకులు కుదురుకోకముందే మ్యాచ్ పూర్తి అయ్యింది. అయితే దీనిపై స్థానిక పౌరహక్కుల సంస్థ ‘సిటిజెన్ పవర్ అగెనెస్ట్ బ్రైబరీ, కరప్షన్ అండ్ వేస్టెజ్’ కొలంబో పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫైనల్ మ్యాచ్పై వెంటనే విచారణ చేయాలంటూ సదరు సంస్థ చైర్మన్ సమంతా తుషార డిమాండ్ చేశాడు. ‘19 నిమిషాల వ్యవధిలో 15 ఓవర్లలో శ్రీలంక 50 పరుగులకు కుప్పకూలింది.
క్రికెటర్ల ఆటతీరుపై అనుమానాలు ఉన్నాయి. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు బయట ప్రేక్షకులు బారులు తీరి ఉండగానే ఆట పూర్తయ్యింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరుగాలి. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ప్లేయర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలన్నీ బయటపెట్టాలి. క్రికెట్ను డబ్బు ప్రభావితం చేస్తున్నది. అవినీతిలో కూరుకుపోయిన లంక క్రికెట్ బోర్డుపై క్రీడా మంత్రి దర్యాప్తునకు ఆదేశించాలి. స్కూల్ స్థాయి క్రికెట్లో కూడా ఇలాంటి స్కోర్లు నమోదు కావడం లేదు’ అని తుషార పేర్కొన్నాడు.