IND vs PAK | ఆసియాకప్ ఆరంభ పోరులో నేపాల్పై భారీ విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న పాకిస్థాన్.. కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం భారత్తో జరుగనున్న మ్యాచ్ కోసం ఒక రోజు ముందే ప్లెయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయించింది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టులో షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తిఖార్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవుఫ్ చోటు దక్కించుకున్నారు. అంతా ఊహించినట్లే పాక్ పేస్ త్రయం నసీమ్, షాహీన్, రవుఫ్ నుంచి టీమ్ఇండియా టాపార్డర్కు ప్రధాన ముప్పు పొంచి ఉంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్.. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లతో సమతూకంగా కనిపిస్తున్నది. తొలి మ్యాచ్లో భారీ సెంచరీతో కదంతొక్కిన కెప్టెన్ బాబర్ మరోసారి మంచి ప్రదర్శన చేయాలని తహతహలాడుతున్నాడు. వన్డే ఫార్మాట్లో భారత్పై బాబర్ గణాంకాలు ఏమంత గొప్పగా లేవు. మరోవైపు టీమ్ఇండియా మాత్రం గాయాలతో సతమతమవుతున్నది. ఆసియాకప్నకు ఎంపిక చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఓపెనర్గా మంచి రికార్డు ఉన్న ఇషాన్ను అదే స్థానంలో ఆడిస్తారా లేదా మిడిలార్డర్లో బ్యాటింగ్కు పంపుతారా అనేది రేపే తేలనుంది.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ పేసర్ హరీస్ రవుఫ్ కలిసి ముచ్చటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో రవుఫ్ బౌలింగ్ను కోహ్లీ ఊచకోత కోసిన విషయం తెలిసిందే. నాణ్యమైన పేస్ను ఎదుర్కొంటూ విరాట్ వీరంగమాడటంతో ఆ మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది. మరోసారి ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు ఖాయమని భావిస్తున్న సమయంలో ఆసియా కప్ మ్యాచ్కు ముందు ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది.