PAK vs SL | వరుణుడు పదే పదే ఆటంకాలు కలిగించినప్పటికీ పాకిస్థాన్ దంచికొట్టింది. ఆసియా కప్ 2023లో ఫైనల్ ఎంట్రీ కోసం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో పాక్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. నిర్ణీత 42 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేశారు.
కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్కు మొదట్నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వర్షం పడటం మొదలవ్వడంతో మ్యాచ్ను అంపైర్లు తొలుత 45 ఓవర్లకు కుదించారు. 45 ఓవర్లతో మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చాలాసేపటి వరకు పాక్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. 27.4 ఓవర్లకు వచ్చేసరికి 5 వికెట్లను కోల్పోయిన పాక్ 130 పరుగులకే పరిమితమైంది. అప్పటివరకు అబ్దుల్లా షఫీఖ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన నలుగురు పాక్ బ్యాటర్లు ఫఖర్ జమాన్ (4), బాబర్ ఆజమ్ (29), మహమ్మద్ హరిస్ (3), మహమ్మద్ నవాజ్ (12) తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరారు. అయితే ఐదో వికెట్ పడ్డ వెంటనే వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో చాలాసేపటి తర్వాత అంపైర్లు మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించి తిరిగి ప్రారంభించారు.
మ్యాచ్ పునః ప్రారంభమైన తర్వాత పాక్ ఇన్నింగ్స్లో వేగం పుంజుకుంది. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ (86), ఇఫ్తిఖర్ అహ్మద్ (47) చెలరేగి ఆడారు. ఇద్దరి భాగస్వామ్యంలో జట్టుకు భారీ స్కోర్ను అందించారు. అయితే 41వ ఓవర్లో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇఫ్తిఖర్ అహ్మద్ తర్వాత క్రీజులోకి వచ్చిన షాదాబ్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఫలితంగా నిర్ణీత 42 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. శ్రీలంక ఫైనల్కు చేరాలంటే ఈ మ్యాచ్లో 253 పరుగులు చేయాల్సి ఉంది.