న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ సీజన్ ఆరంభ టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 ఇండియా ఓపెన్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేయగా.. యువ షట్లర్ అశ్మిత చాలిహా ఐదో సీడ్ను ఓడించి సంచలనం సృష్టించింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యువ షట్లర్ అశ్మిత 24-22, 21-16తో ఐదో సీడ్ ఎవ్జెనియా (రష్యా)ను ఓడించి ముందంజ వేసింది. 31 నిమిషాల్లోనే రష్యా షట్లర్ను మట్టికరిపించింది. తనకంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న ప్రత్యర్థిని చూసి వెరువని అశ్మిత వరుస గేముల్లో పాయింట్లు కొల్లగొడుతూ మ్యాచ్ను తన వశం చేసుకుంది. మరో పోరులో పీవీ సింధు 21-5, 21-16తో భారత్కే చెందిన శ్రీకృష్ణ ప్రియపై అలవోక విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ రజత విజేత శ్రీకాంత్ 21-17, 21-10తో సిరిల్ వర్మను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ఇరా శర్మ, అనుపమ, సమీర్ వర్మ విజయాలతో తర్వాతి రౌండ్లోకి ప్రవేశించగా.. చిరాగ్ సేన్ నిరాశపర్చాడు. పురుషుల డబుల్స్లో ఉత్కర్ష్-అక్షన్ శెట్టి, అర్జున్-ధృవ్ కపిల, మహిళల డబుల్స్లో కావ్య-ఖుషి, పుల్లెల గాయత్రి- ట్రెసా జోడీలు గెలిచి ముందంజ వేయగా.. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి- ధృవ్ కపిల, పుల్లెల గాయత్రి-సాయిప్రతీక్ జంటలు తర్వాతి రౌండ్లోకి ప్రవేశించాయి.