Kapil Dev | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ముంబయిలోని ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ గురించి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడి దగ్గరకెళ్లి చెంప దెబ్బ కొట్టాలని ఉంది అని చెప్పారు. ‘అన్ కట్’ ఛానల్తో ముచ్చటించిన కపిల్దేవ్.. పంత్ లేకపోవడంతో టీం ఇండియా బలం తగ్గిందని అన్నారు.
‘పంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిపై నాకు ఎంతో ప్రేమ ఉంది. కోపంగానూ ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోలుకోగానే అతడి ఇంటికెళ్లి చెంప దెబ్బ కొట్టి.. జాగ్రత్తగా ఉండమని చెబుతాను. నువ్వు లేకపోవడంతో జట్టు బలం తగ్గింది అని చెబుతాను. పంత్ ప్రపంచంలోని ప్రేమనంతా పొందాలి. దేవుడు అతడికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. పిల్లలు తప్పు చేస్తే చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నట్లుగానే.. నేను పంత్కు చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నా. నేటి యువకులు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? వారికి చెంప దెబ్బలు పడాలి’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
కాగా, గతేడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులు అతడి మోకాళికి పలు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. పంత్ పూర్తిగా కోలుకొని తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి పంత్ దూరం కానున్నాడు. కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.