భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ముంబై రంజీ జట్టుతో విడదీయరాని అనుబంధముంది. కానీ అతడి కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పుడు ముంబైతో అనుబంధాన్ని తెంచుకోబోతున్నాడు. దేశవాళీలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్కు చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. దీంతో అతడు వచ్చే సీజన్ నుంచి గోవాకు ఆడనున్నాడు. ఈ మేరకు ముంబై రంజీ జట్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కూడా అప్లై చేశాడు.
22 ఏళ్ల అర్జున్.. 2020-21 సీజన్లో ముంబై తరఫున రెండు మ్యాచ్లాడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానా, పుదుచ్చేరిలతో జరిగిన మ్యాచ్లలో అర్జున్ పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో సైతం అర్జున్ పేరును పక్కనబెట్టింది ముంబై. ఇక ముంబై రంజీ జట్టుతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ పేరు ఉన్నా అతడిని ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే అర్జున్.. ఇక ముంబైతో ఉంటే లాభం లేదని భావిస్తున్నాడట. ఇదే విషయమై సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. ‘అర్జున్ ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపాలని అనుకుంటున్నాడు. అదే అతడి కెరీర్కు ఉపయుక్తకరం. అర్జున్ గోవాకు షిఫ్ట్ అయితే అక్కడ కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. అతడి క్రికెట్ కెరీర్లో ఇదొక కొత్త దశ..’ అని తెలిపింది.
ఇక అర్జున్ రాకపై గోవా క్రికెట్ హర్షం వ్యక్తం చేసింది. తాము లెఫ్టార్మ్ పేసర్ కోసం చూస్తున్నామని, అలాగే మిడిలార్డర్లో పరుగులు చేసే బ్యాటర్ లేక ఇబ్బందులు పడుతున్నామని.. అర్జున్ ఆ లోటును భర్తీ చేస్తాడని తాము నమ్ముతున్నట్టు గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లొత్లీకర్ తెలిపాడు.