Anmol Kharb | ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అన్మోల్ ఖర్బ్ మరోసారి సత్తా చాటింది. కొద్దిరోజుల క్రిత మే ‘బెల్జియం ఇంటర్నేషనల్’ను గెలుచుకున్న 17 ఏండ్ల ఈ అమ్మాయి.. ఆదివారం లుబ్లిన్ (పోలండ్) వేదికగా ముగిసిన ‘పోలిష్ ఇంటర్నేషనల్ 2024’ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో అన్మోల్.. 21-12, 21-8తో మిలెనా (స్విట్జర్లాండ్)ను ఓడించి వరుసగా రెండో టైటిల్ నెగ్గింది.
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, ప్రజానంద రమేశ్బాబు, విదిత్ గుజరాతితో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 3.5-0.5తో స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. యూఎస్ఏ, ఉజ్బెకిస్థాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబు, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్ బృందం 3.5-0.5తో అజర్బైజాన్ను చిత్తు చేసింది. కజకిస్థాన్, యూఎస్ఏ రజతం, కాంస్యం గెలిచాయి. 97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలవడం భారత్కు ఇదే ప్రథమం. మెన్స్ కేటగిరీలో 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్యం గెలవగా ఉమెన్స్ కేటగిరీలో 2022లో కాంస్యం దక్కడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన. ఒక చెస్ ఒలింపియాడ్ ఈవెంట్లో ఒకే దేశానికి (ఓపెన్, ఉమెన్) రెండు స్వర్ణాలు రావడం ఈ టోర్నీ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
సుమారు 190 దేశాలు పోటీపడ్డ చెస్ ఒలింపియాడ్లో భాగంగా భారత్ అపజయమే లేకుండా టైటిల్ను గెలిచింది. 11 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో భారత పురుషుల బృందం వరుసగా 8 రౌండ్లు గెలిచింది. 9వ రౌండ్ను (ఉజ్బెకిస్థాన్) డ్రా చేసుకోగా 10వ రౌండ్లో టాప్సీడ్ అమెరికాను ఓడించింది. 11 రౌండ్లకు గాను భారత్ ఖాతాలో 21 పాయిం ట్లు (రౌండ్కు 2) దక్కడం విశేషం. మహిళల జట్టూ వరుసగా 8 రౌండ్లు నెగ్గి 9వ రౌండ్ను డ్రా చేసుకుంది. తిరిగి 10, 11 రౌండ్లలో పైచేయి సాధించింది. 11 రౌండ్లలో అమ్మాయిలు 19 పాయింట్లు దక్కించుకున్నారు.