Rishabh Pant | క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పంత్ను బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ కలిశారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన వారు పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అరా తీశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు.
‘ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యులు అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ.. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అభిమానులుగా మేము అతన్ని కలిశాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పాం. రిషబ్ తొందర్లోనే కోలుకుని మనముందుకొస్తాడు. అతడి ఆటను మళ్లీ గ్రౌండ్లో చూస్తాం. రిషబ్ కోసం అందరం ప్రార్థిద్దాం’ అని అన్నారు.
రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.